Rahul Gandhi | కొవిడ్ ప్రోటోకాల్ పాటించకపోతే జోడో యాత్రను నిలువరించడం లేదా వాయిదా వేయడం గురించి ఆలోచించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన లేఖపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించే ఎత్తుగడ.. అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జీ జైరాం రమేశ్ సూచించిన కొద్ది సేపటికే రాహుల్ గాంధీ నేరుగా వ్యాఖ్యానించారు. తన యాత్రను ఆపేందుకే కేంద్రం కొవిడ్ ప్రోటోకాల్స్ అంటున్నదని, యాత్రను నిలువరించేందుకు కొత్త సాకులు వెతుకున్నదని రాహుల్ మీడియా సమావేశంలో చెప్పారు.
‘భారత్ జోడో యాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్లు కొత్త ఆలోచన చేశారు. కొవిడ్ వస్తున్నందున యాత్రను ఆపాలంటూ నాకు లేఖ రాశారు. నా యాత్రను ఆపేందుకు సాకులు వెతుకుతున్నారు. మాస్కులు ధరించండి.. యాత్రను ఆపండి.. ఇవన్నీ సాకులే.. వాళ్లు తనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు, సత్యానికి భయపడుతున్నారు’ అని హర్యానాలోని నుహ్లో మీడియాతో అన్నారు. తన యాత్రను నిలువరించేందుకు మరో కొత్త ఆలోచనతో రండి అంటూ వ్యంగ్యంగా రాహుల్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తన యాత్ర జమ్ముకశ్మీర్ వరకు కొనసాగి తీరుతానని చెప్పారు.
రాహుల్ పాదయాత్ర రాజస్థాన్ నుంచి ఇవాళ హర్యానాలోకి చేరింది. యాత్ర ఇవాల్టితో 106 రోజులైంది. హర్యానాలోని నుహ్లో చారిత్రాత్మక గాంధీగ్రామ్ను రాహుల్ సందర్శించారు. గాంధీగ్రామ్ ప్రజలు రాహుల్ను స్వాగతించి మేవాటి తలపాగను తలకు చుట్టారు. రాహుల్ కాలికి గాయం కావడంతో బ్యాండేజ్తో కట్టుకట్టారు.