న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు మండిపడింది. ఆమె బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో దేశం భగ్గుమంటోందని సర్వోన్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు. దేశంలో అలజడి, ఆగ్రహ వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వమే సృష్టించిందని, ఇందుకు ఏ ఒక్కరో కారణం కాదని నూపుర్ శర్మను ఉద్దేశించి రాహుల్ పేర్కొన్నరు.
కేరళలోని వయనాద్లో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. దేశంలో ఇవాళ నెలకొన్న పరిస్ధితిని ప్రధాని, హోం మంత్రి, బీజేపీ, ఆరెస్సెస్లు సృష్టించాయని దుయ్యబట్టారు. పాలక ప్రభుత్వమే విద్వేష వాతావరణాన్ని సృష్టించిందని అన్నారు. ఇది దేశానికి, ప్రజల ప్రయోజనాలకు విఘాతమని ఆందోళన వ్యక్తం చేశారు.