రాజద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎలాంటి కేసులూ నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. నిజం మాట్లాడటం దేశభక్తి అవుతుందని అన్నారు. నిజం చెబితే ఎంత మాత్రమూ దేశద్రోహం కాదని పేర్కొన్నారు.
రాజద్రోహ చట్టంపై సుప్రీం ఇచ్చిన స్టేను ట్విట్టర్లో పేర్కొంటూ.. రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పడం అంటే దేశాన్ని ప్రేమించినట్టేనని, దేశ ద్రోహం కాదని, సత్యాన్ని వినడం రాజ ధర్మమని, సత్యాన్ని అణచివేయడం మాత్రం అహంకారమంటూ పరోక్షంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు.
రాజద్రోహ చట్టంపై సుప్రీం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎలాంటి కేసులూ నమోదు చేయవద్దని ఆదేశించింది. రాజద్రోహ చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు విన్న వించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.
అయితే సుప్రీం చేసిన వ్యాఖ్యలపై సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజద్రోహంపై పునః పరిశీలన పూర్తయ్యే వరకూ ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని అనడం సరైన విధానం కాదన్నారు. తీవ్రంగా పరిగణింపబడే నేరాల్లో ఈ కేసును నమోదు చేయకుండా ఉండలేమని, కొన్ని కేసులు ఉగ్రకోణం, మనీలాండరింగ్ కోణంలోనూ ఉండొచ్చన్నారు.
అయితే ఈ కేసులను పరిశీలించేందుకు ఓ స్పెషల్ అధికారి వుండాలని, ఎస్పీ స్థాయి అధికారి పరిశీలించి, నమోదు చేస్తే ఆమోదం పొందేట్లు మార్గదర్శకాలను రూపొందించాలని అనుకుంటున్నట్లు తుషార్ మెహతా సుప్రీంకు విన్న వించారు.
ఇక ఈ చట్టంపై సుప్రీం స్పందిస్తూ.. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై పునః పరిశీలన పూర్తయ్యేంత వరకూ ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయవద్దని అన్నారు. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే.. వారు కోర్టులను ఆశ్రయించవచ్చని సూచించారు.