న్యూఢిల్లీ : అదానీ గ్రూప్పై తన పార్లమెంట్ ప్రసంగాన్ని ఎడిట్ చేశారని, ప్రసంగంలోని పలు భాగాలను రికార్డుల్లో అనుమతించలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నన్ను అవమానించేలా మాట్లాడిన పదాలను రికార్డుల నుంచి తొలగించలేదని, తన ప్రసంగ భాగాలను మాత్రం ఎడిట్ చేసి పార్లమెంట్ రికార్డులకు ఎక్కించలేదని దుయ్యబట్టారు. ప్రధాని తనను నేరుగా అవమానిస్తూ తన పేరు చివర నెహ్రూ కాకుండా గాంధీ అని ఎందుకు ఉందని ప్రశ్నించారని అన్నారు.
దేశ ప్రధాని స్వయంగా అలా మాట్లాడినా ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించలేదని రాహుల్ తప్పుపట్టారు. పార్లమెంట్లో తాను మాట్లాడిన అంశాలను రాహుల్ గుర్తుచేశారు. ప్రధాని మోదీ, గౌతం అదానీల మధ్య సంబంధంపై తాను మాట్లాడానని, ఎలాంటి చెడ్డ పదాలు ఉపయోగించలేదని పేర్కొన్నారు. ప్రధానితో అదానీ విదేశీ పర్యటనలకు వెళ్లగా ఆయా దేశాల్లో కాంట్రాక్టులు ఆయనకు దక్కాయని అన్నారు.కేరళలోని వయనాద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ప్రధానితో సన్నిహితంగా ఉన్నందునే ఈరోజు దేశంలో 30 శాతం ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ అదానీ ఎయిర్పోర్టుల నుంచే సాగుతున్నదని తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్లను అదానీ దక్కించుకునేందుకు నిబంధనలు ఎలా మార్చారనేది తాను పార్లమెంట్ ప్రసంగంలో వివరించానని గుర్తుచేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో ప్రధాని పర్యటన అనంతరం అదానీకి ప్రాజెక్టులు, రుణాలు మంజూరయ్యాయని ఆరోపించారు. అదానీ, అంబానీలతో ప్రధాని సంబంధాలపై మాట్లాడితే ఆయన అవమానంగా భావిస్తారని కానీ వారితో ప్రధాని మోదీ ఉల్లాసంగా గడుపుతున్న ఫోటోలను మీరు ఇంటర్నెట్లో చూడవచ్చని రాహుల్ పేర్కొన్నారు. అదానీ విమానంలో ప్రధాని ప్రయాణించడం మీరు చూడవచ్చని, అదానీతో సరదాగా ముచ్చటించడం కూడా మీ కంటపడుతుందని వ్యాఖ్యానించారు.