న్యూఢిల్లీ: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు. ఇదే విషయమై ఇండియా (INDIA) కూటమిలోని అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని తమ పార్టీ ఇప్పటికే నిర్ణయించిందన్నారు. సాధారణంగా ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. కానీ, ప్రస్తుతం దేశంలో అన్ని పార్టీలపై అసాధారణమై ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించారు. అది ప్రజల నుంచి వచ్చిందని, అందుకే అన్ని పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు.
2014లో తనవల్లే బీజేపీ (BJP) కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ప్రధాని మోదీ (PM Modi) అహంకారంతో ఉన్నారని గెహ్లాట్ విమర్శించారు. అయితే ఆ ఎన్నికల్లో కమలం పార్టీకి 31 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, మిగిలిన 69 శాతం మంది ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇండియా కూటమి బెంగళూరు (Bengaluru) సమావేశం తర్వాత ఎన్డీయేలో (NDA) భయం పట్టుకుందని చెప్పారు.
2024 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో తాము అధికారంలోకి వస్తామన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఎప్పటికీ సాధించలేదన్నారు. ఆయనకు అత్యంత ప్రజాధరణ ఉన్నప్పుడే అది సాధ్యంకాలేదని విమర్శించారు. ఇప్పుడు ఆయన ఓట్ల శాతం తగ్గుతుందని, వచ్చే ఎన్నికల ఫలితాలు ప్రధాని ఎవరనే విషయాన్ని నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు.