Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు ఊరటనిచ్చింది. బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో జ్యుడీషియల్స్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్పై విచారణ జరిపింది. ఈ మేరకు బెయిల్ను పొడిగించింది. పిటిషన్పై విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. 2013 కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై గుజరాత్కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. దోషిగా నిర్ధారిస్తూ మార్చి 23న రెండేళ్ల శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, పైకోర్టులో తీర్పును సవాల్ చేసుకునేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఆ తర్వాత లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో రాహుల్ సూరత్ సెషన్స్ కోర్టులో తనకు విధించిన శిక్షతో పాటు సస్పెన్షన్పై అప్పీల్ చేశారు. బెయిల్ను పొడిగించిన కోర్టు.. సస్పెన్షన్పై విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.