Rahul Gandhi : భారత్-చైనా సరిహద్దు అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. డ్రాగన్ దూకుడు నేపధ్యంలో సరిహద్దులో ఇలాంటి పరిస్ధితి ఎదురైతే మన్మోహన్ సింగ్ అయితే ప్రధాని పదవి నుంచి తప్పుకునే వారని అన్నారు.
మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే ప్రధాని పదవికి సర్ధార్జీ రాజీనామా చేసేవారని రాహుల్ వ్యాఖ్యానించారు. చైనా వ్యవహారంపై ప్రధాని మోదీ మంతనాలు సాగిస్తుండగానే భారత భూభాగాలను డ్రాగన్ ఆక్రమించిందని రాహుల్ ఆరోపించారు. జైపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
బీజేపీ మాతృసంస్ధ ఆరెస్సెస్ విద్వేషం వెదజల్లుతోందని ఆరోపించారు. ఆరెస్సెస్ విద్వేష భావజాలాన్ని ప్రేమతో అడ్డుకోవాలని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంం క్షేత్రస్ధాయిలో ప్రజల చెంతకు పార్టీ కార్యకర్తలు చేరువ చేయాలని రాహుల్ పిలుపు ఇచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్ సోషల్ మీడియాలో చేస్తున్న కుహనా జాతీయవాద ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.