న్యూఢిల్లీ: పార్లమెంట్లో అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) షేక్హ్యాండ్ ఇవ్వబోగా.. కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తిరస్కరించారు. ఈ ఘటన పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఇవాళ ఉదయం జరిగింది. విపక్షాలు నిరసన ప్రదర్శన చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి బిట్టు ఆ మార్గంలో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మంత్రి బిట్టు రాకను గమనించిన రాహుల్ గాంధీ.. నమ్మకద్రోహి వస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు కేంద్ర మంత్రి బిట్టు కూడా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ దేశానికే శత్రువు అన్నారు.
రవ్నీత్ బిట్టు మూడుసార్లు ఎంపీగా గెలిచారు. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన బీజేపీలో చేరారు. అయితే మకర ద్వారం వద్ద బిట్టును చూస్తూ కామెంట్ చేసిన రాహుల్ ఆ తర్వాత షేక్హ్యాండ్ ఇవ్వబోయారు. హల్లో బ్రదర్, వంచించిన స్నేహితుడివి, ఆందోళన వద్దు అని, మళ్లీ కాంగ్రెస్లోకి వస్తావని రాహుల్ అన్నారు. అయితే షేక్హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన కేంద్ర మంత్రి బిట్టు తన కౌంటర్లో రాహుల్ను తిట్టేశారు. ఏదో యుద్ధం గెలిచినవాళ్ల తరహాలో కూర్చున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్కు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదో మంత్రి బిట్టు చెప్పారు. 1984లో నిర్వహించిన బ్లూస్టార్ ఆపరేషన్ గాంధీ కుటుంబం వల్లే జరిగిందని విమర్శించారు. సిక్కు వ్యతిరేక అల్లర్లు కూడా ఆ కుటుంబం వల్ల జరిగినట్లు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ తన చేయి ఇవ్వబోయిన క్షణంలో.. నువ్వే దేశద్రోహివి అని, ఈ దేశానికి శత్రువు నువ్వే అని, ప్రతి రోజు దేశ సైనిక దళాల గురించి తక్కువ చేసి మాట్లాడుతావని, గాంధీ కుటుంబంతో సర్ధార్ ఎవరూ చేయి కలపబోరు అని, సిక్కులను మర్డర్ చేశారని మంత్రి బిట్టు ఆరోపించారు. 8 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది.