భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన సలహా, సంప్రదింపుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మొత్తం 21 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు. ఉక్రెయిన్ పరిస్థితులు, అక్కడి భారతీయులను తరలిస్తున్న విధానం, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్రం ఈ సభ్యులకు సవివరంగా తెలిపింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీ ఆనంద్ శర్మ, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా.. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదితో పాటు ఇతరులు హాజరయ్యారు. ఉక్రెయిన్లో భారత విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.
సమావేశం అద్భుతంగా ఉందంటూ శశి థరూర్ ట్వీట్..
ఈ సమావేశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి జైశంకర్తో సహా అతని టీమ్ సభ్యులు అద్భుతంగా సమాధానాలు ఇచ్చారని, తమ సూచనలను కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ విధానం స్పిరిట్ అచ్చు ఇలాగే ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని థరూర్ మెచ్చుకున్నారు. ఆరు రాజకీయ పార్టీల నుంచి తొమ్మిది మంది సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ రాహుల్ గాంధీ, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, ఎంపీ ఆనంద్ శర్మ, నేను హాజరయ్యాం. స్నేహపూర్వక వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. దేశం విషయానికి వస్తే.. మనమందరమూ ఒక్కటే అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు.
చర్చలు అద్భుతమంటూ కేంద్ర మంత్రి ట్వీట్
ఇక ఇదే సమావేశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ విషయంలో విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో సలహాలు, సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. చర్చ అద్భుతంగా జరిగింది. వ్యూహాత్మక, మానవ కోణంలో ఉక్రెయిన్ విషయంపై చర్చించాం. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి తీసుకువచ్చే ప్రక్రియలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అందరూ మద్దతిచ్చారు అంటూ జైశంకర్ ట్వీట్ చేశారు.