ఇంఫాల్ : మణిపూర్ హింసాకాండ బాధితులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన తనను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు రాహుల్ గురువారం చేరుకోగా, భద్రతా పరమైన కారణాలు చూపుతూ చుర్చందనాపూర్కు బయలుదేరిన ఆయన కాన్వాయ్ను అడ్డగించింది. ఆపై హెలికాఫ్టర్లో రాహుల్ అల్లర్లు చెలరేగిన జిల్లాను చేరుకుని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలను పరామర్శించారు. ఆపై తన పర్యటన గురించి వివరిస్తూ ప్రజలు తనను ప్రేమతో ఆహ్వానించి అక్కున చేర్చుకున్నారని రాహుల్ ట్వీట్ చేశారు.
మణిపూర్కు చెందిన తన సోదరులు, సోదరీమణులందరూ చెప్పే విషయాలను వినేందుకు వచ్చానని, వారంతా తనను ప్రేమతో అక్కున చేర్చుకున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను నిలువరించడం దురదృష్టకరమని, మణిపూర్ గాయం మానాల్సి ఉందని, శాంతి స్ధాపనే మన ఏకైక అజెండాగా ఉండాలని రాహుల్ ఆకాంక్షించారు. ఇక అంతకుముందు రాహుల్ గాంధీ కాన్వాయ్ను మణిపూర్ పోలీసులు నిలువరించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు.
అల్లర్లతో అట్టుడికిన (Manipur Violence) ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనడం అవసరమని ఘర్షణ కాదని వ్యాఖ్యానించారు. సహాయ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను కలిసేందుకే రాహుల్ వెళ్లారని గుర్తుచేశారు. అలజడి చెలరేగిన మణిపూర్లో భీతిల్లిన ప్రజలకు సాంత్వన చేకూర్చడమే రాహుల్ పర్యటన ఉద్దేశమని వివరించారు. మణిపూర్ భగ్గుమంటున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరు మెదపడం లేదని ఖర్గే దుయ్యబట్టారు. రాహుల్ ప్రజలను కలిసేందుకు వచ్చినప్పుడు మాత్రం డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణితో అడ్డగిస్తున్నాయని ఆరోపించారు.
Read More :