Rahul-Priyanka Gandhi | న్యూఢిల్లీ, మార్చి 21: అమేథీ, రాయ్బరేలీ.. ఈ పేర్లు వినగానే గాంధీల కుటుంబమే గుర్తుకువస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అత్యంత కీలకమైన ఈ రెండు నియోజకవర్గాలు తొలి నుంచీ గాంధీల కుటుంబానికి కంచుకోటలుగా నిలుస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు వీటికి బీటలు వారాయి. నియోజకవర్గాలపై గాంధీల పట్టు చేజారుతున్నది. ఈ రెండు స్థానాలలో ఈ సారి రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ, అమేథీ నుంచి రాహుల్గాంధీ బరిలోకి దిగుతారని అందరూ భావిస్తుండగా.. వారు మాత్రం నిరాసక్తత చూపుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్గాంధీ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ఈసారి మళ్లీ అక్కడ పోటీచేసేందుకు ఆయన వెనుకడుగు వేస్తున్నారు.
ఇక రాయబరేలి నుంచి వరుసగా ఐదుసార్లు లోక్సభ ఎన్నికైన సోనియాగాంధీ.. ఈ సారి లోక్సభ బరి నుంచి తప్పుకున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి గెలుపొందారు. దీంతో రాయబరేలీ స్థానం నుంచి ఈసారి ఆమె కుమార్తె ప్రియాంక వాద్రాను బరిలోకి దించాలని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ కమిటీ తీర్మానం చేసింది. అయితే ప్రియాంక మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. అమేథీ నియోజకవర్గం 1967 నుంచి ‘గాంధీ’లకు పెట్టనికోటగా ఉన్నది. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ 1980లో అమేథీ నుంచి గెలుపొందారు. ఆయన మరణించిన తరువాత రాజీవ్గాంధీ 1981లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఆయన 1991లో హత్యకు గురయ్యేవరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం సోనియాగాంధీ 1999లో గెలుపొందగా, 2004లో రాహుల్గాంధీ ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2019 వరకు రాహుల్ ఈ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మొదటిసారిగా బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ పరిస్థితిని గమనించే ఆయన గత ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేసి అక్కడ గెలుపొందారు.