Raghav Chadha : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. విపక్ష ఇండియా కూటమి నిరసన సందర్భంగా ఆప్ నేత రాఘవ్ చద్దా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇండియా కూటమి సత్తా, ఐక్యత ఏంటో ఈరోజు వెల్లడైందని అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యోగక్షేమాల గురించి, దిగజారుతున్న ఆయన ఆరోగ్యం గురించి కలత చెందేవారు ఈరోజు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. ఎక్సైజ్ స్కామ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికలకు ముందు తాను ఎన్డీయే పాలకుల గురించి హెచ్చరించానని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఎన్నో సంస్ధలున్నాయని, వాటిని అడ్డుపెట్టుకుని ఎప్పటికప్పుడు రాజకీయ నేతలను వేధిస్తారని చెప్పానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉన్న దర్యాప్తు ఏజెన్సీలు పాలక పార్టీ రాజకీయ ప్రత్యర్ధులకు న్యాయం చేయవని, తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్ధల కుట్రలకు చరమగీతం పాడతామని చెప్పానని గుర్తుచేశారు. తాము ఇలాంటి సంస్దలపై వేటు వేస్తామని, మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరినీ తప్పుడు కేసులతో వేధించరాదని స్పష్టం చేశారు.
అఖిలేష్ అంతకుముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్కు మెజారిటీ ఉండేదని, ఇప్పుడు వారికి మెజారిటీ లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం కొనసాగబోదని, ఇది ఎప్పుడైనా కుప్పకూలే సర్కారేనని అఖిలేష్ జోస్యం చెప్పారు. ఎప్పుడైనా పతనమయ్యే ఈ సర్కార్కు తాము ఒక్కటే చెబుతున్నానమని ఏ ఒక్కరికీ అన్యాయం చేయవద్దని మాత్రమే తాము కాషాయ పాలకులను కోరుతున్నామని అన్నారు.
Read More :