Raghav Chadha : ఆమ్ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారు. అంతేకాదు.. బీజేపీలో చేరబోతున్నారు. వీరిలో ప్రస్తుతం రాజ్యసభ ఆప్ డిప్యూటీ లీడర్ అశోక్ కుమార్ మిట్టల్ కూడా ఉన్నారు. ఇటీవలే రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించిన ఆప్.. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది. కానీ, ఇప్పుడు ఆయన కూడా పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ బహిష్కృత నేత రాఘవ్ చద్దా వెల్లడించారు.
శుక్రవారం రాఘవ్ చద్దా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో మూడింట రెండొంతుల ఆప్ సభ్యులు కలిసి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అంటే రాజ్యాంగం ప్రకారం ఈ ముగ్గురూ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు. ఇలా ఒక సభలో ఒక పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు.. అధికార లేదా వేరే ఏ పార్టీలోనైనా చేరవచ్చు. ఇలా చేరితే, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. దీంతో ఈ ముగ్గురి రాజ్యసభ సభ్యత్వానికి ఢోకా లేకపోవచ్చు. ఇక, రాఘవ్ చద్దా, అశోక్, సందీప్.. ముగ్గురూ 2022 నుంచి ఆప్ తరఫున రాజ్యసభలో సభ్యులుగా కొనసాగుతున్నారు. తాజా మీడియా సమావేశంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 15 ఏళ్లపాటు చెమట, రక్తం చిందించాను. ఇప్పుడు ఆ పార్టీ తన సిద్దాంతాలు, విలువలు, నైతిక అంశాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం తప్ప దేశం కోసం, జాతి ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. ఇది చాలా మంది ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నా. నేను సరైన పార్టీలో లేనని భావిస్తున్నా. సరైన వ్యక్తిని.. తప్పుడు పార్టీలో ఉన్నా. అందుకే ఈ రోజే ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉంటున్నా. ప్రజల కోసం వెళ్తున్నా’’ అంటూ ప్రకటించారు. తమతోపాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్జిత్ సింగ్ సహ్నే కూడా త్వరలో ఆప్ను వీడి బీజేపీలో చేరుతారు అంటూ రాఘవ్ వెల్లడించారు. అలాగే, తాను మోదీ, అమిత్ షా నాయకత్వంలో పని చేయబోతున్నట్లు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం.. రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్లో మంత్రిగా చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.