cheetah | భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఆరు చీతాలకు రేడియో కాలర్ను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల వరుసగా చీతాలు మరణిస్తున్న నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం నాలుగు పిల్లలు జన్మించాయి. మొత్తం 24 చీతాల్లో ఇప్పటివరకు 8 మరణించాయి. సాధారణ కారణాల వల్లే అవి మృతిచెందినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే రేడియో కాలర్ల వల్లే మృత్యువాతపడ్డట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటికి రేడియో కాలర్లను తొలగించారు.
‘ప్రస్తుతం 11 చీతాలు (ఆరు మగ, ఐదు ఆడ) ఎన్క్లోజర్లో ఉన్నాయి. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇప్పటివరకు ఆరు చీతాలకు రేడియో కాలర్ తొలగించాం. ప్రస్తుతం అవి ఆరోగ్యంగానే ఉన్నాయి’ అని అధికారులు తెలిపారు. చీతాల కదలికలను తెలుసుకునేందుకు వాటికి రేడియో కాలర్లను బిగించారు. వాటి కారణంగా చీతాలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే చీతాలను తిరిగి ఎన్క్లోజర్లోకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై చీతాల కదలికలను తెలుసుకునేందుకు డ్రోన్లను వినియోగించనున్నారు.