QR Code Scam | న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్నది. అయితే భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకొనేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. భక్తులకు ఫోన్లు చేసి, సోషల్ మీడియా సందేశాలు పంపుతూ.. అయోధ్య ఆలయానికి విరాళాలు ఇవ్వాలంటూ భక్తులను బురిటీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్, సందేశాల ద్వారా డబ్బులు పంపేందుకు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా క్యూఆర్ కోడ్లు పంపిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో నిధులు సమీకరించే బాధ్యతను ఆయోధ్య ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఎవరికీ అప్పగించలేదని, ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిందూ మత సంస్థలు సూచిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖతో పాటు ఢిల్లీ, యూపీ పోలీసు శాఖల దృష్టికి తీసుకెళ్లామని వీహెచ్పీ తెలిపింది.