కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యర్థి పార్టీలపైకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుండటంపై ఆమె మండిపడ్డారు. మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తే భయంతో పారిపోయేవాళ్లు చాలామందే ఉండొచ్చు, కానీ మేం (తృణమూల్ కాంగ్రెస్) మాత్రం భయపడం అని వ్యాఖ్యానించారు.
‘మీరు మీకు చేతనైంది చేసుకోండి. మేం అన్నింటిని భరిస్తాం. కానీ దేశాన్ని మాత్రం అమ్మకండి’ అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. ‘దర్యాప్తు సంస్థలను మాపై ఎగదోయండి. కానీ దేశాన్ని, దేశ ప్రజలను మాత్రం ఐక్యంగా ఉండనీయండి’ అని సూచించారు. కేంద్రం అడుగడుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని ఆమె అన్నారు.