చండీఘఢ్ : ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని పంజాబ్కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. 2021లో పాకిస్తాన్ను సందర్శించేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేందుకు తాను పాక్ ఎంబసీని సందర్శించిన సమయంలో అక్కడి సీనియర్ అధికారులు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. అప్పటి ఘటనను గురించి ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు.
తాను పాకిస్తాన్ హై కమిషన్తో ఆన్లైన్ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నానని ఆమె చెప్పారు. తాను లాహోర్లోని ఓ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వాల్సిఉందని, అక్కడి కట్టడాల గురించి రాయదలుచుకున్నానని ఎంబసీ అధికారులకు తెలిపానని గుర్తుచేసుకున్నారు. తాను అక్కడనుంచి వెళుతుండగా మరో అధికారి అక్కడికి వచ్చి తనను వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగారని చెప్పారు. మీరు ఎందుకు పెండ్లి చేసుకోలేదని తనను ప్రశ్నించాడని, పెండ్లి చేసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారని, లైంగిక వాంఛలు ఎలా తీర్చుకుంటారని అనుచితంగా ప్రశ్నించాడని తెలిపారు.
వేరే టాపిక్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన తన ప్రశ్నలతో వేధించాడని పంజాబ్ ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాను విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్కూ ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ పోర్టల్లోనూ గతంలో ఆమె ఫిర్యాదు చేయడంతో పాటు పాక్ విదేశాంగ మంత్రి బులావల్ భుట్టోకి లేఖ రాశారు. పాక్ హైకమిషన్ అధికారితో జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లనూ ఆమె విదేశాంగ మంత్రికి పంపారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే భారీ మొత్తం చెల్లిస్తామని ప్రలోభపెట్టినా తాను తిరస్కరించానని మహిళా ప్రొఫెసర్ వెల్లడించారు. పాక్ హై కమిషన్ కార్యాలయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించినా ఎవరూ స్పందించకపోవడంతో ఈ ఘటనపై ప్రజల ముందుకొచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. పాక్ హై కమిషన్ వద్దకు వెళ్లే భారత మహిళలు పాక్ అధికారుల ఉద్దేశాలను తెలుసుకోవాలని మహిళా ప్రొఫెసర్ కోరారు.