చండీగఢ్: పంజాబ్లో వ్యవసాయ వ్యర్థాల మంటలు (Farm Fires) ఒక్క రోజే 740 శాతం మేర పెరిగాయి. ఆదివారం 1068 పంట వ్యర్థాల దహనం సంఘటనలు నమోదయ్యాయి. నాసా శాటిలైట్ చిత్రాల ద్వారా ఇది వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికారలు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ వ్యర్థాల మంటలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, పంజాబ్ రైతులు ప్రతి ఏటా భారీగా వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం ఆందోళన రేపుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం, పొగ మంచుకు ఇది దారి తీస్తున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుంచి 29 వరకు నాసా వరల్డ్ వ్యూ శాటిలైట్ చిత్రాల డేటాను పంజాబ్ అధికారులు విశ్లేషించారు. దీని ప్రకారం అక్టోబర్ 25 కంటే 26న ఎక్కువగా వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుపెట్టినట్టు తెలిసింది. అక్టోబర్ 27 మరునాడైన 28న శనివారం పంట వ్యర్థాలను తగులబెట్టడం గణనీయంగా తగ్గింది. అయితే ఆదివారం ఉన్నట్టుండి ఇది 740 శాతం మేర పెరిగింది.
మరోవైపు నాసా శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన పంజాబ్ అధికారులు అలెర్ట్ అయ్యారు. వ్యవసాయ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. కాగా, గతేడాదితో పోలిస్తే సెప్టెంబరు 15 నుంచి అక్టోబర్ 29 వరకు వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టడం 57 శాతం తగ్గినట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది.