Punjab Polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్ధి ఎవరో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించబోదని, పంజాబ్ ప్రజలే ఎవరు సీఎం కావాలనేది నిర్ణయిస్తారని సిద్ధూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను నిర్ణయిస్తుందని మీకెవరు చెప్పారని సిద్ధూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.
పంజాబ్ ప్రజలు తమ ఎమ్మెల్యేలు ఎవరుండాలని నిర్ణయిస్తారని, సీఎంగా పాలనా పగ్గాలు ఎవరు చేపట్టాలనేదీ ప్రజలే నిర్ణయిస్తారని సిద్ధూ తేల్చిచెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్-బీజేపీ కూటమి ప్రధానంగా తలపడుతున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా పట్టు నిలుపుకునేందుకు పాలక కాంగ్రెస్ పోరాడుతోంది.
రైతుల ఆందోళనల ఊతంగా అధికార పగ్గాలు అందుకోవాలని అకాలీదళ్ వ్యూహాలకు పదునుపెడుతుండగా కెప్టెన్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ తోడ్పాటుతో సత్తా చాటాలని కమలనాధులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.