చండీగఢ్: పంజాబ్లో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం హీటెక్కుతున్నది. వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ ఏడుగురు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించింది.
పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) పార్టీలతో కూటమిగా బరిలో దిగుతున్నది. ఈ కూటమి నుంచి బీజేపీ 65 స్థానాల్లో, పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) 15 స్థానాల్లో పోటీపడనున్నాయి. ఈ మేరకు ఆ మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ ఒక కూటమిగా.. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్ మరో కూటమిగా బరిలో దిగనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా తమ బలాన్ని ప్రదర్శించబోతున్నాయి.