ఇటుకబట్టీ యజమానులు ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే ఇంధనంలో 20 శాతం వరిగడ్డిని తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదివారం పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరిగడ్డిని కాల్చడం అడ్డుకోవడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతేకాదు వరిగడ్డిని ఇటుక బట్టీల యజమానులకు అమ్మడం ద్వారా రైతులు ఆర్థికంగా లాభపడతారని రాష్ట్ర పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాక మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హయర్ చెప్పారు. అంతేకాదు వరిగడ్డిని ఇటుకలు కాల్చేందుకు వాడడంలో సహాయం చేస్తామని తెలిపారు.
ఇటుకబట్టీల్లో 20 శాతం వరిగడ్డిని ఇంధనంగా ఉపయోగించేందుకు ఇటుకబట్టీ యజమానులకు ప్రభుత్వం ఆరు నెలల సయమం ఇచ్చింది. వచ్చే ఏడాది మే 1వ తేదీ నుంచి ఈ ఆదేశాలను పాటించని ఇటుకబట్టీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
వరి పంట కోత పూర్తయిన తర్వాత పంజాబ్ రైతులు చాలామంది వరిగడ్డికి నిప్పుపెడతారు. దాంతో, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. అందుకని ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇటుకబట్టీల్లో వరిగడ్డి వాడకాన్ని తప్పనిసరి చేసింది.పంట వ్యర్థాలను నిర్వహించేందుకు పంజాబ్ ప్రభుత్వం త్వరలోనే 1.5 లక్షల మంది రైతులకు సబ్సీడీ ద్వారా యంత్రాలు అందించనుంది.