చండీఘఢ్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై నిరసనలు కొనసాగుతున్న నేపధ్యంలో అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకురానున్నట్టు పంజాబ్ ఆప్ సర్కార్ ప్రకటించింది. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సంయుక్త తీర్మానాన్ని తీసుకురావాలని సీఎం భగవంత్ మాన్కు తొలుత విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సూచించారు.
బజ్వా ప్రతిపాదనను సీఎం భగవత్ మాన్ సమర్ధిస్తూ ఈ వాదనతో తాను ఏకీభవిస్తానని చెప్పారు. 17 ఏండ్ల యువత సాయుధ బలగాల్లో చేరి నాలుగేండ్లకే మాజీ సైనికోద్యోగులకు లభించే ఎలాంటి ప్రయోజనాలు లేకుండా బయటకు రావడం సరైంది కాదని అన్నారు. గతంలో సాగు చట్టాలు, సీఏఏ ఆపై అగ్నిపథ్ వంటి చట్టాలు తీసుకువచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
ప్రజలను గందరగోళంలోకి నెట్టే చట్టాలను తీసుకురావద్దని మాన్ కేంద్రానికి హితవు పలికారు. అగ్నిపథ్ పధకాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం అగ్నిపథ్ పధకానికి కేంద్రం నోటిఫికేషన్లు జారీ చేసి ముందుకెళుతోంది.