Punjab : పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కనున్నారు. గురువారం, ఆగష్టు 27న రాష్ట్రవ్యాప్త మహాబంద్కు పిలుపునిచ్చారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 4 లక్షల మంది ఈ బంద్లో పాల్గొననున్నారు. ఆప్ ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన డీఏలు ఇంకా విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ వారు ఈ ఆందోళన చేపట్టనున్నారు.
దీంతో గురువారం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలతోపాటు, ప్రైవేటు కార్యకలాపాలు కూడా స్తంభించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత బంద్ రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడం, దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ ఈ మహా బంద్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం డీఏ చెల్లించకపోవడానికి సరైన కారణం చెప్పలేకపోతోందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వాదనలను పంజాబ్, హరియాణా హైకోర్టు తిరస్కరించాయని గుర్తు చేశారు. తాజా మహా బంద్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చేస్తున్న కీలక డిమాండ్లివి. పెండింగ్ ఉన్న డీఏను వెంటనే చెల్లించాలి. అది కూడా 18 శాతం డీఏ. పాత పెన్షన్ స్కీంనే అమలు చేయడంతోపాటు, కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డీఏతోపాటు, ఇతర బకాయిలను కూడా చెల్లించాలని పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి.
మహాబంద్లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. డిప్యూటీ కమిషనర్, ఎస్డీఎం, తహసీల్, రెవెన్యూ, రవాణా, ఆరోగ్య, విద్యా శాఖ ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఆస్పత్రుల్లో ఓపీ సేవల్ని కూడా నిలిపివేయనున్నారు. అలాగే, బస్సుల రవాణా, వైద్యారోగ్య సేవల్ని కూడా పూర్తిగా ఆపేస్తున్నారు. అయితే, అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగుతాయి.