చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. ఆప్ ఎమ్మెల్యేలను గాలం వేస్తున్న బీజేపీ, ఆ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలో విశ్వాస తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని గురువారం నిర్వహించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. అయితే పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఉత్తర్వును రద్దు చేశారు. ‘నిర్దిష్ట నియమాలు లేకపోవడం’ వల్ల ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఆర్డర్ను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.
కాగా, పంజాబ్ గవర్నర్ తీరుపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యం హత్యగా పేర్కొన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కోసం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. పంజాబ్లో బీజేపీ తలపెట్టిన ఆపరేషన్ కమలం విఫలమైందన్నారు. అందుకే రెండు రోజుల కిందట అనుమతించిన గవర్నర్, బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల వల్ల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని రద్దు చేశారని విమర్శించారు.