ఛండీఘడ్ : కొవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షలను పొడిగించినట్లు తెలిపింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పలు మినహాయింపులను సైతం ఇచ్చింది. వ్యాపారులు దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ప్రైవేట్ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని సూచించింది. వారాంతపు రోజుల్లో సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఆదివారాల్లో మాత్రం సాధారణ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కొవిడ్ అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సులభతరం చేశాయి. ఏప్రిల్ రెండోవారం నుంచి కరోనా రెండో వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.