చండీగఢ్: పంజాబ్ కొత్త క్యాబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. నూతన ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్ చన్నీ నేతృత్వంలో రాత్రి 8 గంటలకు క్యాబినెట్ కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్ధూ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రాతో సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రణ్దవా ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా, నూతన మంత్రివర్గంలోకి ఎవరెవరినీ తీసుకున్నారు అన్న ప్రశ్నకు.. ఆ విషయం పార్టీ హైకమాండ్కు, ముఖ్యమంత్రికి మాత్రమే తెలుసని రణ్దవా చెప్పారు. ముఖ్యమంత్రి తనకు అంత భారీగా సెక్యూరిటీ అక్కర్లేదని, కొంతమందిని తగ్గించాలని కోరినట్లు కూడా ఆయన తెలిపారు. ఇదిలావుంటే ఇవాళ బాధ్యతలు చేపట్టడంతోనే ముఖ్యమంత్రి చరణ్జీత్ ఉన్నతాధికారుల పదవుల్లో మార్పులు చేశారు.
అమరీందర్ సింగ్ హయాంలో చీఫ్ సెక్రెటరీగా పనిచేసిన తజ్వీర్సింగ్ను ఆ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో హుస్సేన్ లాల్ను చీఫ్ సెక్రెటరీగా నియమించారు. ఇక అమరీందర్ సింగ్కు అత్యంత సన్నిహితుడైన గురుకీరత్ క్రిపాల్ సింగ్ స్థానంలో రాహుల్ తివారీని స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమించారు.