అమృత్సర్ : పంజాబ్ అమృత్సర్లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆసుపత్రి వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఎనిమిది ఫైర్ ఇంజిన్ల సహాయంతో గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆసుపత్రి వద్ద టాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది.
అగ్ని ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నెప్రాలజీకి సంబంధించిన ఆరు వార్డులు, రెండు స్కిన్, మూడు సర్కిల్ వార్డుల్లో రోగులను ఖాళీ చేయించి, ఇతర వార్డులకు తరలించారు. ఓపీడీ సమీపంలో ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయని ప్రిన్సిపల్ జీఎంసీ రాజీవ్కుమార్ దవేగన్ తెలిపారు. ప్రమాదంలో ఆసుపత్రి వద్ద పార్క్ చేసిన వాహనాలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.