చండీఘడ్: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ తన నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తిని చితకబాదారు. ఆయనతో పాటు అక్కడున్న వారు కూడా ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. పటాన్కోట్ జిల్లాలోని బోహలో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. టెంట్ కింద నిలుచున్న జనసమూహాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే జోగిందర్ మాట్లాడారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నియోజకవర్గానికి ఏం చేశారని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. అయితే ఓ పోలీసు ఆఫీసర్ ఆ వ్యక్తిని బయటకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఇంతలో ఎమ్మెల్యే ఆ వ్యక్తిని తన దగ్గరకు రమ్మన్నారు. సదురు వ్యక్తి దగ్గరకు రాగానే తన చేతిలో ఉన్న మైక్ను ఎమ్మెల్యే ఆ వ్యక్తికి అందించాడు. ఆ వెంటనే ప్రసంగాన్ని అడ్డుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే చితకబాదాడు. చెంపపై కొట్టి.. ఆ తర్వాత వీపుపై పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న జనం కూడా కొందరు ఆ వ్యక్తిపై పంచ్లు కురిపించారు. ఆ వ్యక్తిని తొలుత బయటకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించి పోలీసు కూడా చివరకు దాడి చేయడం శోచనీయం. ఎమ్మెల్యే జోగిందర్ ప్రవర్తన తీరును ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుఖీందర్ సింగ్ ఖండించారు. ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించకూడదని అన్నారు.