చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు తప్పుకోవాలని సోనియా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సిద్దూ తన రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా ఆశించినట్లే తాను రాజీనామా చేస్తున్నట్లు సిద్దూ తన ట్విట్టర్లో తెలిపారు.
As desired by the Congress President I have sent my resignation … pic.twitter.com/Xq2Ne1SyjJ
— Navjot Singh Sidhu (@sherryontopp) March 16, 2022
ఐదుగురిపై వేటు..
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఫలితాలను చవిచూసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చీఫ్లను పదవులకు రాజీనామా చేయాల్సిందిగా కోరారు. పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గణేశ్ గోడియాల్ ప్రకటించారు.