Punjab Polls : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కరోనా వైరస్ నిర్ధారణ అయిన రోజునే పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని ఆయనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ పంజాబ్ పాలిట కరోనా వైరస్ వంటి వాడని ఆయనను మనం కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బయట నుంచి వ్యాధులను మనం కొనితెచ్చుకోబోమని అన్నారు.
పంజాబ్లోని మొరిందాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో సీఎం చన్ని ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎంను తాను ఈరోజు ఉదయం కలిశానని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించానని చెప్పుకొచ్చారు. బయట నుంచి వచ్చిన కేజ్రీవాల్ పంజాబ్ను పాలించాలని కోరుకుంటున్నారని, పంజాబ్కు ఆయన కరోనా వైరస్ వంటి వాడని, బయట నుంచి వచ్చే వ్యాధికి మనం బలికాకూడదని అన్నారు.
కాగా తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, తాను హోం ఐసోలేషన్లో ఉన్నానని కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్లో ఉండాలని ఆయన సూచించారు.