అమృత్సర్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు అయిన బీజేపీ, కాంగ్రెస్కు ఏమాత్రం తగ్గకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నది. అభ్యర్థుల ఎంపికను కూడా బీజేపీ, కాంగ్రెస్ కంటే ఆమ్ఆద్మీ పార్టీనే ముందుగా పూర్తిచేసింది. ఇప్పుడు పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమైంది.
రేపు (మంగళవారం) మధ్యాహ్నం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఉదయం ప్రకటించారు. అయితే, ఆప్ సీఎం అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేయడంలేదు. దేశంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్ ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తున్నది. అందుకోసం ఇటీవల 7074870748 ఫోన్ నంబర్ను ప్రకటించింది. రాష్ట్ర ప్రజలు ఈ నెంబర్కు ఫోన్ చేసి ఆప్ అగ్రనేతల్లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారో చెప్పాలని కోరింది.
జనం తమ అభిప్రాయాలను చెప్పాల్సిన గడవు ఈ సాయంత్రం 5 గంటలతో పూర్తికానుంది. ఆ తర్వాత ఎవరికి ఎక్కువ మద్దతు లభించిందో పరిశీలించి రేపు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనుంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తమ పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు భగవంత్ మాన్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నారు. అయితే, అందుకు భగవంత్ మాన్ నిరాకరించారు.
ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆప్ సీఎం అభ్యర్థిని ఖరారు చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కాగా, పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14 ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.