చండీగఢ్: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంపై ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని వెనుదిరగడం తమకు బాధ కలిగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రతా వైఫల్యం వల్లే ప్రధాని పర్యటన రద్దయిందన్న వార్తలను తోసిపుచ్చారు. భద్రతా వైఫల్యం జరిగిందనడం ముమ్మాటికీ తప్పే అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అవసరమైతే విచారణ చేయిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్లో వెళ్లాల్సిన ప్రధాని, చివరి నిమిషంలో పర్యటనలో మార్పులు చేసుకొని రోడ్డుమార్గంలో వెళ్లాలని నిర్ణయించుకొన్నారని చెప్పారు. బఠిండా-ఫిరోజ్పూర్ మోదీ పర్యటనను ఎస్పీజీ, ఐబీ వంటి కేంద్ర సంస్థలే పర్యవేక్షించాయని చెప్పారు. కేంద్ర హోంశాఖ ప్రత్యక్షంగా భద్రతా పర్యవేక్షణలో నిమగ్నమైందన్నారు. ‘ప్రధాని ర్యాలీకోసం భద్రతా ఏర్పాట్లను నేను అర్థరాత్రివరకు పర్యవేక్షించా. ఈ సభ కోసం 70 వేల కుర్చీలు వేస్తే 700 కూడా నిండలేదు. దానికి నేనేం చేయగలను? బఠిండాలో ప్రధానికి స్వాగతం పలికేందుకు నేనే వెళ్దామని అనుకొన్నా. కానీ మా సీఎస్కు కరోనా సోకటంతో హోంమంత్రిని పంపా’ అని పేర్కొన్నారు. ‘మీ సీఎం సహాయం వల్ల ప్రాణాలతో తిరిగి రాగలిగాను’ అని అధికారులతో మోదీ అన్న వ్యాఖ్యలపై విలేకరులు చన్నీని ప్రశ్నించగా.. ‘కోపంతో లేదా రాజకీయపరంగా ప్రధాని ఏదో ఒక మాట అంటే దానిపై నేను ఏ కామెంట్ చేయబోన’న్నారు. ప్రధానికి ఏదైనా హాని జరిగే పరిస్థితి ఎదురైతే, ముందుగా తన రక్తాన్ని చిందిస్తానని, పంజాబీల ఆత్మలోనే ఇది ఉన్నదన్నారు.
వారం ముందే ఎస్పీజీ ఆధీనంలోకి!
ప్రధాని, రాష్ట్రపతి వంటి వీవీఐపీలకు జెడ్ క్యాటగిరీలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) భద్రత కల్పిస్తుంది. వీరు పర్యటించే రూట్మ్యాప్ను కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూపొందిస్తుంది. వారం ముందే రూట్ మ్యాప్ను ఎస్పీజీ స్వాధీనం చేసుకొంటుంది. మూడు లేక నాలుగు దఫాలుగా మాక్ డ్రిల్ నిర్వహించాకే, నాలుగు అంచెలుగా భద్రతా ఏర్పాట్లను పరీక్షించిన తర్వాతే తుది క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదీకాక, వీవీఐపీకి ఎలాంటి అపాయం కలుగకుండా చిన్న చిన్న టీమ్లను ఏర్పాటు చేసి, ప్రయాణ మార్గాలను ఎప్పటికప్పుడు ఎస్పీజీ పర్యవేక్షిస్తుంది. ఎస్పీజీ భద్రత కలిగిన వీవీఐపీల పర్యటనల్లో ఆకాశయానం నుంచే కాకుండా, అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాలను కూడా సిద్ధం చేయటం కేంద్ర హోంశాఖ బాధ్యత. కానీ బుధవారం ప్రధాని పర్యటనలో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయలేదు.