చండీఘఢ్ : పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు. కాంగ్రెస్లో అంతర్గత పోరు లేదని సిద్ధూ ఇటీవల వ్యాఖ్యానించిన నేపధ్యంలో చన్నీ సైతం ఇవే సంకేతాలు పంపారు. పంచాయత్ ఆజ్ తక్ కార్యక్రమంలో చన్నీ మాట్లాడుతూ సిద్ధూ తమతో ఉన్నారని, రాహుల్ వెంట ఆయన నడుస్తున్నారని చెప్పారు. సిద్ధూ నాకు సోదరుడు..తమ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ అని చన్నీ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా ప్రస్తుతం సీఎం చన్నీ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించడం పట్ల సిద్ధూ కినుకు వహించిన సంగతి తెలిసిందే.
పంజాబ్ జనాభాలో 32 శాతం పైగా ఉన్న దళితుల ఓట్లను చన్నీ అభ్యర్ధిత్వంతో కొల్లగొట్టవచ్చని, తిరిగి అధికార పగ్గాలు చేపట్టవచ్చని కాంగ్రెస్ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. సిద్ధూ సీఎం అభ్యర్ధిత్వానికి రేసులో ఉన్నా మాజీ క్రికెటర్ను కాదని దళిత నేత, ప్రస్తుత సీఎం చన్నీ వైపు హైకమాండ్ మొగ్గుచూపుతోంది. పంజాబ్లో జాట్ సిక్కులు రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉండగా చన్నీ తొలి దళిత సీఎంగా ఇటీవల అత్యున్నత బాధ్యతలు చేపట్టారు.
ఇక 117 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పంజాబ్లో ఈనెల 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు పంజాబ్లో బహుముఖ పోరు జరగనుంది. పాలక కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుండగా శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), కెప్టెన్ సింగ్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెసతో పొత్తుతో బీజేపీ ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పంజాబ్ పీఠం దక్కాలంటే ఆయా పార్టీలు కనీసం 59 సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంది.