చండీఘఢ్ : పంజాబ్ సీఎం అభ్యర్దిగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పార్టీ హైకమాండ్ ప్రకటిస్తే తనకు ఎలాంటి సమస్య లేదని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుంచో సేవకుడిగా పనిచేస్తున్నానని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు.
సిద్ధూ తనకు సోదరుడు వంటి వాడని, పార్టీ హైకమాండ్ సిద్ధూను సీఎం అభ్యర్ధిగా ప్రకటించినా తనకు ఎలాంటి సమస్య లేదని చన్నీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాషాయ గూటికి చేరారని, ఆయన చేసిన తప్పిదాలన్నీ బీజేపీని వెంటాడతాయని వ్యాఖ్యానించారు. ఆప్ నుంచి తమకు ఎలాంటి పోటీ లేదని, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ ఉండదని ఎద్దేవా చేశారు.
పంజాబ్లో నాయకుడిగా ఎదగాలని తొలుత కేజ్రీవాల్ కోరుకున్నారని, ప్రజల్లో స్పందన చూసిన తర్వాత భగవంత్ మాన్ను ముందుకునెట్టి బలిపశువును చేశారని అన్నారు. ఇక పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో చంకౌర్ సాహిబ్ స్ధానం నుంచి ఓటమిపాలవుతారని తమ పార్టీ చేపట్టిన సర్వేలో వెల్లడైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక పంజాబ్లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.