న్యూఢిల్లీ : పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్టమైన యూట్యూబ్ స్టార్ను కలిసేందుకే. అనేక కష్టాలు పడి.. యూట్యూబ్ స్టార్ ఇంటికి ఆ బాలుడు చేరుకున్నప్పటికీ తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే.. ఆ యూట్యూబ్ స్టార్ దుబాయ్ వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. నిరాశకు గురయ్యాడు బాలుడు.
వివరాల్లోకి వెళ్తే.. పాటియాలాకు చెందిన 13 ఏండ్ల బాలుడు.. 8వ తరగతి చదువుతున్నాడు. యూట్యూబ్లో ట్రిగ్గర్డ్ ఇన్సాన్ అనే చానెల్ను ఫాలో అవుతున్నాడు. ఈ చానెల్లో వచ్చే కామెడీ అతనికి ఎంతో ఇష్టం. దీంతో ఆ చానెల్ నిర్వాహకుడు నిష్చాయ్ మల్హాన్ను కలిసేందుకు సిద్ధమయ్యాడు బాలుడు. మల్హాన్ ఢిల్లీలోని పితంపుర అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు ఆ అబ్బాయికి తెలిసింది. ఇక అక్టోబర్ 4వ తేదీన తన సైకిల్పై ఢిల్లీకి ప్రయాణం ప్రారంభించాడు. మూడు రోజుల పాటు 250 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి, పితంపుర అపార్ట్మెంట్స్కు చేరుకున్నాడు. కానీ ఆ సమయంలో మల్హాన్ ఇంట్లో లేడని, దుబాయ్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలపడంతో.. అతను తీవ్ర నిరాశ చెందాడు.
అక్టోబర్ 4వ తేదీన తమ కుమారుడు కనిపించకుండా పోయేసరికి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాటియాలాలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఢిల్లీ వైపు వెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. అలా సీసీటీవీ ఫుటేజీ ద్వారా బాలుడి ఆచూకీని కనుగొన్నారు. పితంపురలో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని తల్లిదండ్రులకు అప్పగించారు.