Pune man : విహార యాత్ర విషాదంగా మారింది. కాబోయే భార్య పుట్టిన రోజును సెలబ్రేట్ చేసేందుకు పర్యాటక ప్రాంతానికి వెళ్లిన యువకుడు అక్కడే లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని, లోహగడ్ పోర్ట్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, పూనేకు చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ అనే యువకుడు తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ, ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. కొంతకాలం క్రితం అతడికి ఒక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.
కాబోయే భార్య పుట్టిన రోజున సంతోషంగా తనతో గడపాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ఆమె పుట్టినరోజుకు ముందు మరో ఇద్దరు స్నేహితులతో, తనకు కాబోయే భార్యతో కలిసి గురువారం మావల్ తహసీల్ పరిధిలోని లోహగడ్ పోర్టుకు వెళ్లాడు. ఈ ప్రాంతంలో తిరుగుతూ అనేక ఫొటోలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల సమయంలో ఒక లోయ వద్ద, అంచున నిలబడి ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. వేగంగా వీచిన గాలులకు పర్వతం అంచున పట్టుకోల్పోయి, కాలుజారిన కేతన్ విశాల్.. ఆ లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ లోయ దాదాపు 400 అడుగులు ఉంటుంది. అతడు ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా చెట్లతో నిండిపోవడం, చాలా లోతుగా ఉండటం వల్ల సహాయక చర్యలు చాలా కష్టమయ్యాయి.
అయినప్పటికీ దాదాపు మూడు గంటలకుపైగా శ్రమించి అతడి మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. తనకు కాబోయే భార్య, స్నేహితులతో ఆనందంగా గడిపేందుకు వెళ్లిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడం ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపింది. అప్పటివరకు తమతోపాటే ఉన్న వ్యక్తి కళ్లముందే లోయలో పడి చనిపోవడంతో అతడి స్నేహితులు, కాబోయే భార్య షాక్కు గురయ్యారు. కేతన్, ఆ యువతి వివాహం వచ్చే నవంబర్లో జరగాల్సి ఉంది.