ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్థలంలో మోదీకి చిన్న గుడి కట్టారు. జైపూర్ నుంచి ఎర్రని పాల రాయిని తెప్పించి నిర్మాణానికి వినియోగించారు. తెల్ల పాలరాయితో చేసిన మోదీ విగ్రహాన్ని అందులో ఏర్పాటు చేశారు. భద్రతగా ముందు వైపు గట్టి అద్దాన్ని ఫిక్స్ చేశారు. ఆ గుడి ముందు మోదీకి అంకితమిస్తూ ఒక పద్యంతో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశారు. రూ.1.6 లక్షల వ్యయంతో ఆరు నెలల్లో మోదీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం దీనిని ప్రారంభించారు.
కాగా, ప్రధాని అయిన తర్వాత మోడీ చాలా అభివృద్ధి పనులు చేశారని, జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి వాటి పట్ల విజయవంతంగా వ్యవహరించారని రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన ముండే అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన వ్యక్తికి కూడా ఒక మందిరం ఉండాలని తాను భావించానని, అందుకే మోదీకి గుడిని తన సొంత ప్రాంగణంలో నిర్మించినట్లు మీడియాకు చెప్పారు.
మరోవైపు ఈ చర్యను మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు ఖండించాయి. మతోన్మాదం తారాస్థాయికి చేరిందనడానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అనంత్ గాడ్గిల్ విమర్శించారు. ఒకవైపు మాజీ ప్రధాన మంత్రుల పేర్లతో ఉన్న అవార్డులు, పథకాలను బీజేపీ తొలగిస్తున్నదని, మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలు వారి నాయకులకు ఆలయాలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పూణే అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ కూడా ఈ చర్యను ఖండించారు. ఎవరైనా తమ నాయకుడి పట్ల విధేయత కలిగి ఉండవచ్చని చెప్పారు. అయితే ఒక వ్యక్తిని ఏకంగా దైవంగా మార్చడాన్ని పూణే నగరం సహించదన్నారు.