పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ శ్రీరాములు వెల్లడించారు. కందతోట్టంకు చెందిన 80 వ్యక్తితో పాటు లాస్పేట్లోని నవర్కులంకు చెందిన 20 సంవత్సరాల యువతి ఒమిక్రాన్ పాజిటివ్గా పరీక్షించారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు డిసెంబర్ 7న కరోనా బారినపడ్డారు. వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్పించగా.. కోలుకున్నాడు.
యువతి హోం ఐసోలేషన్లో ఉండి కోలుకుంది. వీరు ఒమిక్రాన్ బారినపడ్డారని తమకు తెలియదని, వారి నమూనాల ఫలితాలు మంగళవారం వచ్చాయన్నారు. అయితే, వీరిద్దరికి ఎలా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనే విషయం తెలుసుకోవడంతోపాటు కాంటాక్టులను గుర్తించే పనిలో ఆరోగ్యశాఖ ఉందని డాక్టర్ శ్రీరాములు వివరించారు. కొవిడ్ పాజిటివ్గా తేలినవారందరి నమూనాలను ప్రస్తుతం జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కోసం పంపుతున్నట్లు చెప్పారు. ఫలితాలు రావడానికి కనీసం 20 రోజులు పడుతోందని పేర్కొన్నారు.