మెయిన్పురి: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 5న పోలింగ్ జరుగనుంది. సమాజ్వాది చీఫ్ ములాయంసింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి ఎస్పీ తరఫున అఖిలేశ్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్ను బరిలో దించారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని తన చిన్నమామ, ప్రగతిశీల్ సమాజ్వాది పార్టీ (లోహియా) చీఫ్ శివపాల్ యాదవ్ను కోరింది.
ఈ విషయాన్ని శివపాల్ యాదవే స్వయంగా మీడియాకు వెల్లడించారు. శివపాల్ యాదవ్ ఆరేండ్ల క్రితమే అఖిలేశ్ యాదవ్తో విభేదించి, సమాజ్వాది పార్టీని వీడి సొంతంగా ప్రగతిశీల్ సమాజ్వాది పార్టీ (లోహియా)ను స్థాపించారు. ఈ నేపథ్యంలో డింపుల్ యాదవ్.. శివపాల్ యాదవ్ మద్దతు కోరడం ఆసక్తికరంగా మారింది. శివపాల్ యాదవ్ కూడా డింపుల్ కోరిక మేరకు ఆమెకు మద్దతు తెలిపేందుకు అంగీకరించారు.
కానీ, అందుకోసం ఆమెకు ఒక షరతు విధించారు. అఖిలేష్ మరోసారి నా పట్ల తప్పుగా వ్యవహరిస్తే నువ్వే నాకు సాక్షిగా ఉండాలని డింపుల్కు కండిషన్ పెట్టినట్లు శివపాల్ తెలిపారు. ఆ కండిషన్కు డింపుల్ కూడా ఒప్పుకుందని చెప్పారు. కాగా, శివపాల్ సమాజ్వాది పార్టీకి దూరమై ఆరేండ్లు అవుతున్నా.. ఇలా అవసరమైనప్పుడు ఆ పార్టీకి మద్దతుగా నిలువడం ఇది నాలుగోసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.