శ్రీహరికోట, హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ఉదయం 11:56 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల బరువున్న ఓషన్శాట్-3(ఈవోఎస్-06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లింది. ఇందులో హైదరాబాద్కు చెందిన ధ్రువ సంస్థ రూపొందించిన థైబోల్ట్ శాట్-1, థైబోల్డ్ శాట్-2 ఉపగ్రహాలు ఉన్నాయి. మిగితావి భారత్, భూటాన్ సంయుక్తంగా తయారుచేసిన భూటాన్శాట్, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ రూపొందించిన 4 అస్ట్రోకాట్ ఉపగ్రహాలు, బెంగళూరుకు చెందిన పిక్సెల్ సంస్థ తయారుచేసిన ఆనంద్శాట్ నింగిలోకి చేరాయి.
రోజుకు 2 సార్లు హైదరాబాద్పై నిర్ణీత కక్ష్యలోకి..
థైబోల్ట్ శాట్-1, థైబోల్ట్ శాట్-2 ఉపగ్రహాలను అమెచ్యూర్ రేడియో సేవలు అందించేందుకు రూపొందించారు. ఉపగ్రహాల ద్వారా టెలి కమ్యూనికేషన్ సేవలను అమెచ్యూర్ రేడియా వినియోగించుకొంటుంది. ఈ సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో సంస్థ ప్రతినిధి రాంమోహన్ మాట్లాడుతూ.. ఉపగ్రహాలు రోజుకు 2 సార్లు, ఒక్కోసారి 4 సార్లు హైదరాబాద్పైకి నిర్ణీత కక్షలో వచ్చి వెళ్తాయని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. వీటి సేవలు ఏడాది పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నదని వివరించారు.
ఎల్లలు దాటిన తెలంగాణ కీర్తి
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలు అంతరిక్షం వరకు చేరాయి. పలు రంగాల్లో ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. మరో అద్భుత ఘట్టాన్ని ఆవిషరించింది. దేశంలోనే తొలిసారి ప్రైవేట్ ఉపగ్రహాల ప్రయోగ చరిత్రలో మరో రికార్డును సాధించింది. ఐటీ, శాస్త్రసాంకేతిక రంగాల్లో యువతను ప్రోత్సహించే దిశగా సీఎం కేసీఆర్ దార్శనికత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీహబ్లో యువత తమ ప్రతిభతో పలు రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తున్నారు. మొన్నకిమొన్న స్కైరూట్ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లగా, ఇప్పుడు ధ్రువ స్టార్టప్ తయారుచేసిన 2 ఉపగ్రహాలు విజయవంతంగా రోదసిలోకి చేరాయి.
ప్రైవేట్ రాకెట్లు ఇక్కడి నుంచే..
సైరూట్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ దేశంలోనే తొలిసారి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ఎస్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది తెలంగాణ హార్డ్ వేర్ ఇంక్యుబేటర్ టీ వర్స్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ టీహబ్ స్టార్టప్ సంస్థ. ఇప్పుడు నగరానికి చెందిన మరో స్టార్టప్ ధ్రువ పంపిన శాటిలైట్లు విజయవంతమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోనే స్టార్టప్ కంపెనీలు ఇంతటి ఘనతలు సాధిస్తున్నాయని ప్రపంచమంతా కొనియాడుతున్నది.
ప్రధాని శుభాకాంక్షలు
పీఎస్ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇస్రో, ఎన్ఎస్ఐల్కు శుభాకాంక్షలు తెలిపారు. మన సముద్ర వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు భూ పరిశీలక ఉపగ్రహం దోహదపడుతుందని చెప్పారు. ప్రయోగం విజయవంతంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పందించారు. భూటాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ చారిత్రక మైలురాయిని చేరుకున్నదని చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ధ్రువ స్పేస్ బృందం ఆధ్వర్యంలో సీఎస్ఎల్వీ-సీ54 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ధ్రువ స్పేస్ బృందం చైతన్య దొర, క్రాంతి మూసునూరు, అభయ్ ఏగూర్, కృష్ణ తేజ, సంజయ్ నెక్కంటికి హృదయపూర్వక అభినందనలు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది ఎంతో గర్వించదగ్గ క్షణమని, మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.