న్యూఢిల్లీ : దేశ పౌరులకు అందిస్తున్న సేవల నాణ్యతను పెంచడంతోపాటు సరైన సమయంలో అందేలా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పథకాల అమలుకోసం చేపడుతున్న ఉత్తమ విధానాలను స్వీకరిస్తూ, మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ పద్ధతులను అమలుచేయాలని దిశానిర్దేశం చేశారు. అట్టడుగు వర్గాలతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అలా జరిగినప్పుడే సమగ్రాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కార్యక్రమం’ సత్పలితాలు సాధించడాన్ని అభినందించారు.
సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ సంపాదకత్వంలో వచ్చిన ‘యాక్సలరేటింగ్ ఇండియా : 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. భారతదేశం స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏండ్ల మైలురాయిని చేరుకుంటున్న నేపథ్యంలో సామాన్య పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు రాజ్యాంగపరంగా కల్పించిన హామీల పురోగతిని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏరకమైన వివక్షల్లేని జీవితాన్ని ప్రజలకు అందించేందుకు, ‘గణతంత్రం’ అనే పదానికి ఉన్న అర్థాన్ని సార్థకం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. యువతకు నైపుణ్యాన్ని అందించడంలో ప్రభుత్వాలకు తోడుగా ప్రైవేటు రంగం కూడా తోడ్పాటునందించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటుచేయడం ముదావహం అన్న ఉపరాష్ట్రపతి, కార్పొరేట్ సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన మార్గాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మద్దతుగా నిలుస్తుండటం అభినందనీయమన్నారు.
స్వచ్ఛభారత్ పథకం ద్వారా పది కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగడం చక్కటి పరిణామమని, ఈ పథకం ద్వారా కోట్లాది చిన్నారులు అనారోగ్యాల బారిన పడకుండా ఆపగలిగామని వెంకయ్య నాయుడు చెప్పారు. అంతే గాకుండా మహిళలకు తగిన గౌరవాన్ని కల్పించగలిగామని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని అభినందించారు. భారతదేశంలోని విద్యావిధానాన్ని సమగ్రంగా, విలువల ఆధారితంగా మార్చడంతోపాటు చక్కటి అభ్యాసనను అందించే దిశగా ఈ విధానం ఎంతగానో ఉపయుక్తం అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తి, టీమిండియా స్ఫూర్తితో పనిచేసినప్పుడే సమగ్ర వికాసం సాధ్యమవుతున్నదని వెంకయ్య నాయుడు అన్నారు. 28 మంది ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులు, విషయ నిపుణులు రాసిన 25 వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
రాజ్యసభ సభ్యుడు కేజే అల్ఫోన్స్, పుస్తక ప్రచురణకర్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
డయాబెటిస్ చికిత్సలో ‘స్మార్ట్’ ఇన్సులిన్
జూలై నెలలో పెరిగిన వాహనాల డిమాండ్
ఆఫ్ఘాన్ నుంచి మన వాళ్లను రప్పించండి : కాంగ్రెస్
12 రెట్లు పెరిగిన ఎంఆర్ఎఫ్ లాభం
మార్కెట్లోకి హోండా ఇ-స్కూటర్ యు-గో
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..