సార్డీనియా : మన దేశంలోని గ్రామాల్లో మహా అంటే వందేండ్ల వయసు దాటిన వారు ఒకరో, ఇద్దరో కనిపించొచ్చు. కొన్ని గ్రామాల్లోనైతే మచ్చుకైనా కనిపించరు. అలాంటిది ఇటలీలోని ఓ గ్రామంలో ఎక్కువ సంఖ్యలో శతధికులు (Italy Century Village) ఉండి రికార్డు నెలకొల్పారు. స్వచ్ఛమైన వాతావరణం, ఒత్తిడి లేని జీవితం, పుస్తక పఠనం, కపటం లేని మాటలు.. ఇవే వారిని వందేండ్ల వయసు దాటేలా చేస్తుందంటే ఆశ్చర్యమేస్తుంది కదూ!
ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్లోని పర్వత గ్రామం పెర్డాస్డెఫోగు. ఈ గ్రామ జనాభా కేవలం 1,740. వీరిలో 8 మంది 100 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు ఉన్నారు. 100 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న చాలా మంది చనిపోయారు. ఈ ఏడాది మరో ఐదుగురు కూడా సెంచురీ క్లబ్లో చేరారు. రానున్న రెండేండ్లలో మరో 10 మంది శతజయంతి జరుపుకుంటారు. సార్డీనియాలో పుట్టినరోజు కేక్, కొవ్వొత్తులు నిరంతరం సరఫరా అవుతుంటాయి.
ఈ సంవత్సరం ఐదు పుట్టినరోజు వేడుకల్లో 500 కొవ్వొత్తులను ఉపయోగించారు. 100 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసును కలిగివున్న వ్యక్తులు ఉండే ప్రపంచంలోని ఐదు ప్రాంతాలలో సార్డీనియా ప్రావిన్స్ ఒకటి. ప్రస్తుతం ఈ ప్రావిన్స్లో 100 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 534 మంది ఉన్నారు. అంటే, లక్ష జనాభాలో 37 మంది అన్నమాట. ఇటలీలో సెంచరీ సాధించిన వ్యక్తుల సంఖ్య వేగంగా పెరిగింది. 2009 లో ఈ దేశంలో వీరి సంఖ్య 11,000 గా ఉండగా, 2019 లో 14,456, 2021 లో 17,935 కు పెరిగింది.
సార్డీనియా ప్రావిన్స్లో 100 ఏండ్ల వయసు కంటే ఎక్కువ కాలం జీవించి ఉండటానికి వారి ఆరోగ్యకరమైన అలవాట్లే కారణమంటా. గ్రామాల్లో ఆహ్లాదకరమైన పరిశుభ్ర వాతావరణం, పోషకాహారాల వల్లే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం లేదని గ్రామస్తులు చెప్తున్నారు. వీరిలో ఒత్తిడి చాలా తక్కువగా ఉన్నదని, ఆ కారణంగా కూడా వారు వందేండ్లకు పైగా జీవిస్తున్నారని కాగ్లియారి యూనివర్శిటీకి చెందిన డెమోగ్రఫి (జనాభా శాస్త్రం) విభాగం ప్రొఫెసర్ లూయిసా సాలారిస్ పేర్కొంటున్నారు. ఇక్కడి వారు యుద్ధాలతోపాటు ఆకలిని కూడా ఎదుర్కొన్నారని, అందుకే ప్రతీ సమస్యను చిటికెలో పరిష్కారం చూపుతుండటం వల్ల వారిలో ఒత్తిడి తగ్గుతున్నదని చెప్తున్నారు.
ఇక్కడ ఏడాది పొడవునా ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండటం, పుస్తకాలు ఎక్కువగా చదివేందుకు ఆసక్తి చూపుతుండటం కూడా వీరి సెంచరీకి కారణమంటున్నారు వైద్య నిపుణులు. తమ సామాజిక పరిచయాలే మంచి జీవితాన్ని గడిపేందుకు దోహదపడ్డాయని, వృద్ధులు ఆశ్రమాల్లో కాకుండా ఇండ్లలోనే ఉంటారని 105 ఏండ్ల మెలిస్ తమ సీక్రెట్ను బయటపెట్టారు.
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..