Madhu Park Ridge : మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్కు సంబంధించిన అపార్టుమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్.. ప్రభుత్వం నుంచి క్లారిటీ కోరింది. ఈ మేరకు అసోషియేషన్ నుంచి ప్రభుత్వానికి లేఖ రాసింది.
‘మా అపార్ట్మెంట్ విషయమై సీఎం రేవంత్రెడ్డి చేసిన విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో మధు పార్క్ రిడ్జ్ నివాసితుల సంఘంగా తాము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం. సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఒక సందర్భంలో మధు పార్క్ రిడ్జ్ను ప్రభుత్వం ఎప్పుడూ స్వాధీనం చేసుకోవాలని అనుకోలేదు అని చెప్పారు. మరో ప్రకటనలో మధు పార్క్ రిడ్జ్ నివాసితులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారని పేర్కొన్నారు. మా వైఖరి స్పష్టంగా ఉంది. మేం ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ప్రతిపాదననూ తిరస్కరించలేదు. అంగీకరించనూ లేదు’ అని మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్ క్లారిటీ ఇచ్చింది.
అదేవిధంగా ‘ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ప్రతిపాదన అయినా నిర్దిష్ట వివరాలతో లిఖితపూర్వకంగా ఉండాలని మేం కచ్చితంగా చెబుతున్నాం. మేం వాటిని చర్చ కోసం మా జీబీఎంలో ఉంచుతాం. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Madhu Park Ridge