ఇంఫాల్: మణిపూర్లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. (Protests at Imphal hospital) ఇంఫాల్లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు వారిని తరలించారు. అయితే నాగా వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మే 13న కిడ్నాప్ అయ్యారు. జూన్ 10న వారి మృతదేహాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
కాగా, కాల్పుల్లో గాయపడిన కుకీ యువకులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడంపై నిరసనలు వెల్లువెత్తాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. గాయపడిన కుకీ యువకులు మిలిటెంట్లు అని ఆరోపించారు. కొందరు నిరసనకారులు ఆసుపత్రి భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
మరోవైపు పోలీసులు, భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఆసుపత్రి వద్ద ఉన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలతో దాడి చేశారు. ఆసుపత్రిలో చేరిన గాయపడిన ముగ్గురు కుకీ యువకుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో భారీ భద్రత మధ్య చురాచంద్పూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు.