కురుక్షేత్ర, జూన్ 12: పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎటుచూసినా రైతులే కనిపించారు. ఎంఎస్పీ ప్రకటించాలి.. రైతులను రక్షించాలి అంటూ రైతులు నినదించారు. హర్యానాలోని కురుక్షేత్రలో గల పిప్లి మార్కెట్లో సోమవారం నిర్వహించిన మహా పంచాయత్కు హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్కు చెందిన వందలాది రైతులు హాజరయ్యారు. పోలీస్ నోటీసులను లెక్కచేయని రైతన్నలు వందలాది ట్రాక్టర్లపై హర్యానాకు చేరుకున్నారు. మహాపంచాయత్ అనంతరం రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర గంటల పాటు వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. కురుక్షేత్ర బైపాస్కు వాహనాలను మళ్లించాల్సి వచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ ఏర్పాటు చేస్తామని కురుక్షేత్ర జిల్లా అధికారులు హామీ ఇవ్వగా.. సీఎం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు రహదారిని దిగ్బంధించారు. రెజ్లర్ బజరంగ్ పునియాతో పాటు పలువురు ఖాప్ పంచాయత్ల నేతలు పిప్లి మార్కెట్లో నిర్వహించిన మహాపంచాయత్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు నేతలు బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ రైతులను మోసం చేశారని వారు విమర్శించారు. స్వామినాథన్ సిఫారసులకు 50 శాతం కలిపి ఎంఎస్పీ ఇస్తామని చెప్పి రైతులను మభ్యపెట్టారని తూర్పారబట్టారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై లాఠీ ఎక్కుపెడుతున్నారని బీజేపీ ప్రభుత్వ తీరును వారు ఎండగట్టారు. కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయకపోతే దేశవ్యాప్త నిరసన ప్రారంభిస్తామని భారత్ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. పొద్దుతిరుగుడు పంటను క్వింటాలుకు రూ.6400 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మున్ముందు గోధుమలు, వరికి కూడా ఎంఎస్పీ చెల్లించరేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 14న హర్యానా బంద్కు రైతు నేతలు పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కురుక్షేత్ర సమీపంలో జాతీయ రహదారి దిగ్భందం సందర్భంగా బీఆర్ఎస్ కిసాన్ నేత గుర్నామ్ సింగ్చదునీతోపాటు పలువురు రైతులను ఆదుపులోకి తీసుకున్నారు. కురుక్షేత్రలో ఆందోళన చేస్తున్న రైతులకు నాయకత్వం వహిస్తున్న బీఆర్ఎస్ కిసాన్ సీనియర్ నేత గుర్నామ్ సింగ్ చదునీని అధికారికంగా అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గుర్నామ్ సింగ్ను వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేసింది.