లక్నో : 1990 ప్రాంతంలో కశ్మీరీ పండిట్ల దీనగాధను కండ్లకు కట్టిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శించని థియేటర్ల వద్ద హిందూ అనుకూల సంస్ధలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ సినిమా ప్రదర్శించనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిరసనకారులు ఆగ్రాలోని ధియేటర్ యజమానులను హెచ్చరిస్తుండటంతో ధియేటర్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రాలోని సంజయ్ టాకీస్ వద్ద నిరసనకారులు ప్లకార్డులతో ధర్నాకు దిగారు. కుట్రతోనే ఈ సినిమాను పలు ధియేటర్లలో ప్రదర్శించడంలేదని నిరసనకు నేతృత్వం వహించిన హిందూ అనుకూల సంస్ధ ప్రెసిడెంట్ గోవింద్ పరాశర్ ఆరోపించారు.
కుట్రపూరితంగానే కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శించలేదని ఆరోపిస్తూ వారు సినిమా హాల్కు తాళాలు వేయడం కలకలం రేపింది. ఈ సినిమాను ప్రదర్శించకపోతే ఇతర సినిమాలను కూడా ఆడనీయకుండా అడ్డుకుంటామని నిరసనకారులు హెచ్చరించారు. భారతీయ సంస్కృతిని కించపరిచే సినిమాలను ప్రదర్శించే ధియేటర్ల నిర్వాహకులు ఈ మూవీని ఎందుకు ప్రదర్శించడం లేదని పరాశర్ ప్రశ్నించారు. మరోవైపు తగినన్ని ప్రింట్లు లేకపోవడంతోనే ఎక్కువ ధియేటర్లలో కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించడం లేదని ధియేటర్ ఆపరేటర్లు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లను ప్రింట్ల కోసం అడుగుతున్నామని త్వరలోనే ప్రింట్లు వస్తాయని పేర్కొన్నారు.
ఆగ్రాలోని నాలుగు మల్టీప్లెక్స్లు, రెండు సింగిల్ స్ర్కీన్ సినిమాస్లో ఈ సినిమా నడుస్తోందని చెప్పారు. ఇక కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం హిందూ అనుకూల సంస్ధల నిరసనను భారతీయ ముస్లిం అభివృద్ధి మండలి ఛైర్మన్ సమీ అఘాయ్ తప్పుపట్టారు. హిందూ సంస్ధలకు కశ్మీర్ పండిట్లపై నిజంగా ప్రేమ ఉంటే 30 ఏండ్లుగా మౌనంగా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. వారిని తిరిగి కశ్మీర్కు తిరిగి తీసుకువచ్చేవారని వ్యాఖ్యానించారు. ఏ సినిమా ప్రదర్శించాలో ధియేటర్ నిర్వాహకుల హక్కని నిరసనకారులు దీన్ని ఎలా నిర్ణయిస్తారని అన్నారు.