న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో సాంకేతిక మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే పలు నిర్ణయాలను కేంద్ర బడ్జెట్ ఆవిష్కరించింది. ఇందుకోసం డాటా గవర్నెన్స్ పాలసీ, ఎంటీటీ డిజి లాకర్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఎంఎస్ఎమ్ఈలు, పెద్ద వ్యాపార సంస్థలు, చారిటబుట్ ట్రస్టులు తమ డాక్యుమెంట్లను ఆన్లైన్లో నిల్వ చేసుకోవడానికి ‘ఎంటీటీ డిజి లాకర్’ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పింది.
ఆర్థిక సాంకేతిక (ఫిన్టెక్) సేవలను మరింత విస్తృతంగా అందించడానికి డిజి లాకర్లో వ్యక్తులకు అందుబాటులో ఉండే డ్యాక్యుమెంట్ల పరిధిని మరింత విస్తృతం చేయనుంది. వ్యక్తిగత డాటాలోని ముఖ్యమైన సమాచారం తొలగింపునకు గురవుతున్న నేపథ్యంలో కేవైసీ ప్రక్రియను సులభతరం చేయడానికి నేషనల్ డాటా గవర్నెన్స్ పాలసీ తీసుకురానున్నట్టు కేంద్రం తెలిపింది. వివిధ అంశాలకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
5జీ సేవల సాయంతో స్మార్ట్ క్లాస్రూమ్స్, హెల్త్కేర్, వ్యవసాయం, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అప్లికేషన్లు అభివృద్ధి చేసేందుకు 100 ల్యాబ్లు ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2022లో డిజిటల్ లావాదేవీల్లో 76 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. స్టార్టప్లకు ఇస్తున్న ఆదాయ పన్ను ప్రయోజనాలను ఏడాది పాటు(వచ్చే ఏడాది మార్చి వరకు) పొడిగిస్తున్నట్టు తెలిపింది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి 39 వేలకు పైగా నిబంధనలను తగ్గిస్తున్నట్టు, 3,400 న్యాయ నియమాలను నేర రహితం చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.