హైదరాబాద్ : దేశ వారసత్వ సంపదగా విలసిల్లాల్సిన చేనేత వ్యవస్థ నేడు అనేక సమస్యలతో విలవిల్లాడుతుందని, దాన్ని ప్రోత్సహించాలని జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లోని కేంద్ర జౌళీశాఖ సెక్రెటరీ యూపీ సింగ్ను సురేశ్ శుక్రవారం కలిశారు. వచ్చే జనవరి నుంచి చేనేత వస్త్రాలపై 5 శాతం నుంచి 12శాతం పెరగనున్న జీఎస్టీపై దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలను సహృదయంతో అర్థం చేసుకొని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
దేశంలో వ్యవసాయం తర్వాత అతి తక్కువ పెట్టుబడితో కోట్లాది మంది నేతన్నలకు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్న చేనేత, జౌళీరంగాన్ని ప్రభుత్వాలు వాణిజ్య, వ్యాపార దృక్పథంతో చూడడం సరికాదన్నారు. ఒక వైపు చేనేతరంగ వ్యవస్థపై కరోనా ప్రభావం చూపడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నేతన్నలకు జీఎస్టీ పెంపు గుదిబండగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు చేనేత వస్త్రాల పేరిట నకిలీ వస్త్రాలు మార్కెట్లు ముంచెత్తుతూ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ వారి నైపుణ్యానికి విలువ లేకుండా చేస్తున్నాయన్నారు.
ప్రతీ చేనేత వస్త్రానికి హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్లతో పాటు నేసిన చేనేత కార్మికుడి జియోట్యాగింగ్ చేయాలని, నకిలీకి చెక్ పెట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని సురేష్ కోరారు. చేనేత వస్త్రాల విశిష్టత, దేశ స్వాతంత్ర సమరంలో ఈ రంగం పోషించిన పాత్ర, గాంధీజీ చేబూనిన చరక తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అగ్రతారలతో ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.
దేశంలోని నేతన్నలందరికీ ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు, రైతుల మాదిరిగా పెట్టుబడి సాయం, ఇన్సూరెన్స్, ఉచిత హెల్త్కార్డులు, పక్కా ఇండ్లు ఏర్పాటు చేయాలని, ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కోరారు. అంతర్జాతీయంగా దేశ చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు మార్కెటింగ్ ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాము చెప్పిన విషయాలపై సెక్రెటరీ సానుకూలంగా స్పందించారని, మంత్రి పీయుష్ గోయల్ దృష్టికి, జీఎస్టీ కౌన్సిల్, ప్రధాని కార్యాలయానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారని సురేశ్ వివరించారు.