లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ఆదివారం జరగనుంది. ఐదో దశలో 692 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని 2.24 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. చిత్రకూట్, సుల్తాన్పూర్, ప్రతాప్ఘఢ్, కౌషంబి, ప్రయాగరాజ్, బారాబంకి, బహ్రెచ్, స్రవస్తి, గోండా జిల్లాలతో పాటు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన అమేధి, రాయ్బరేలి రామమందిర నిర్మాణ ఉద్యమ కేంద్రం అయోధ్యలో ఐదో దశ పోలింగ్ జరగనుంది. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వంటి ప్రముఖులు ఐదో దశ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరాతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు.
ఇక మంత్రులు సిద్ధార్ధ్ నాద్ సింగ్ (అలహాబాద్ వెస్ట్), రాజేంద్ర సింగ్ అలియాస్ మోతి సింగ్ (ప్రతాప్ఘఢ్), నంద్ గోపాల్ గుప్తా(అలహాబాద్ సౌత్), రమాపతి శాస్త్రి (మంకాపూర్), కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తల్లి, అప్నాదళ్ నేత కృష్ణా పటేల్ అప్నాదళ్ కే తరపున ఐదో దశ పోరులో నిలిచారు. ఇక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధనా మిశ్రా ప్రతాప్ఘఢ్ జిల్లా రాంపూర్ ఖాస్ స్ధానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
యూపీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తుండగా. దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటుగా బదులివ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.