న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీలు తీవ్ర అధ్యాపక కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశ వ్యాప్తంగా 22 ఐఐటీల్లో మొత్తం మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 38 శాతం భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. ప్రతి 10 బోధనా పోస్టుల స్థానాల్లో నాలుగు ఖాళీగా ఉన్నాయి. 22 ఐఐటీలకు 12,198 బోధన పోస్టులు మంజూరు కాగా, అందులో 7,558 మాత్రమే భర్తీ అయ్యాయి. 4,640 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది 38.04 శాతమని ఒక నివేదిక తెలిపింది. ఐఐటీ ఖరగ్పూర్లో అత్యధికంగా 51.31 శాతం బోధనా సిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 48.4 శాతం పోస్ట్ల ఖాళీతో ఐఐటీ (ఐఎస్ఎం) ధన్బాద్ రెండో స్థానంలో ఉంది.
ఈ బోధనా సిబ్బంది లోటును ఈ సంస్థలు అడ్ హాక్, గెస్ట్, కాంట్రాక్టు, తాత్కాలిక, రీ ఎంప్లాయి టీచర్లతో కొంతవరకు భర్తీ చేసుకుంటున్నాయి. ఐఐటీ బాంబే అత్యధికంగా 234 మంది తాత్కాలిక బోధనా సిబ్బందిని నియమించుకుంది. ఐఐటీ మద్రాస్ 139, ఐఐటీ గాంధీనగర్ 81, ఐఐటీ కాన్పూర్ 55 మంది తాత్కాలిక సిబ్బందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు అయితే తాత్కాలిక సిబ్బంది నియామకాల జోలికే వెళ్లలేదు. మరి కొన్నయితే అతి తక్కువ మందిని మాత్రమే నియమించుకున్నాయి. దీనిని బట్టి తాత్కాలిక సిబ్బంది నియామకంలో కూడా ఈ సంస్థలు ఏకరీతిన వ్యవహరించడం లేదన్న విషయం స్పష్టమవుతున్నది.